అల్లిపురం: నగరంలో నేరాల నియంత్రణకు పటిష్ట పోలీసింగ్ చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో నెలవారీ ట్రాఫిక్, క్రైమ్, లా అండ్ ఆర్డర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించిన సీపీ.. రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, ఎన్డీపీఎస్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సమస్యాత్మక, నిర్మానుష్య ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్, పికెట్లు, అవసరమైన చోట డికాయ్ టీమ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈవ్టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, వేధింపులు, మిస్సింగ్, ఎన్డీపీఎస్ కేసుల్లో తక్షణ స్పందనతో ఫ్రెండ్లీ పోలీసింగ్ పాటించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, విజిటర్స్ మానిటరింగ్ సిస్టమ్ (వీఎంఎస్)ను సమర్థవంతంగా వినియోగించి నిందితులను గుర్తించాలని తెలిపారు. సమావేశంలో డీసీపీ–1 (శాంతి భద్రతలు) వి.ఎన్. మణికంఠ చందోలు, క్రైమ్ డీసీపీ లతా మాధురి, అడ్మిన్ డీసీపీ పాపారావు, ఏడీసీపీలు, ఏసీపీలు, స్టేషన్ ఎస్హెచ్ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


