బీచ్రోడ్డు: అధికార భాష హిందీ వినియోగాన్ని దశలవారీగా పెంచుతూ, ప్రభుత్వ కార్యాలయాల అధికారిక కార్యకలాపాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా అన్నారు. విశాఖపట్నం టౌన్ అధికార భాషా అమలు కమిటీ సమావేశాన్ని బుధవారం డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలోని సెమినార్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా 2025లో తమ పరిధిలో అధికార భాష హిందీ అమలుకు విశేషంగా కృషి చేసిన కార్యాలయాలను ఆయన అభినందించి షీల్డ్లను ప్రదానం చేశారు. పెద్ద కార్యాలయాల విభాగంలో విశాఖపట్నం డివిజనల్ రైల్వే కార్యాలయం, నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ, 56వ బెటాలియన్ ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కార్యాలయాలు అవార్డులు అందుకున్నాయి. చిన్న కార్యాలయాల విభాగంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, కేంద్రీయ విద్యాలయం–వాల్తేరు, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయాలకు షీల్డ్లు ప్రదానం చేశారు. అదనంగా, అధికార భాష హిందీ వినియోగాన్ని ప్రోత్సహించడంలో చురుగ్గా వ్యవహరించిన మరో 14 కార్యాలయాలకు ప్రశంసా షీల్డ్లను అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ వార్షిక అంతర్గత పత్రిక ’విశాఖ–భారతి’ 14వ సంచికను లలిత్ బోహ్రా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బెంగళూరులోని దక్షిణ ప్రాంతీయ అధికార భాషా అమలు కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ నిర్మల్ దూబే, అదనపు ప్రధాన అధికార భాషా అధికారి ఇ.శాంతారామ్, కమిటీ కార్యదర్శి నరేంద్ర కుమార్ సింగ్తో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.


