గాజువాక: ఇంటినుంచి అదృశ్యమైన ముగ్గురు బాలుర కేసును గాజువాక పోలీసులు ఛేదించారు. వారు మహారాష్ట్రలోని తమ స్నేహితుల ఇంటి వద్ద ఉన్నట్లు గుర్తించారు. గాజువాక పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ ఏసీపీ వై.శ్రీనివాసరావు, గాజువాక సీఐ వాసునాయుడు తెలిపిన వివరాలు.. గాజువాక ప్రాంతానికి చెందిన హర్షిత్(16), రోహణ్(14), సాహిద్(12) అదృశ్యమైనట్లు బాలుర పినతండ్రి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ఫోన్ విశ్లేషణ, డిజిటల్ ట్రాకింగ్, ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా మహారాష్ట్రలోని సోలాపూర్లో స్నేహితుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. తొలుత తల్లి, లేదా బంధువుల వద్దకు వెళ్లి ఉంటారని భావించారు. చివరికి స్నేహితుల వద్ద గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు.


