మహారాణిపేట: వినియోగదారులు బుకింగ్ చేసిన తర్వాత నిర్ణీత వ్యవధిలోనే ఓటీపీ ఆధారిత డెలివరీ ద్వారా గ్యాస్ సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్పీజీ డీలర్లు, హెచ్పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్ సేల్స్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. సిలిండర్ల డెలివరీలో ఎక్కడా జాప్యం జరగకూడదని, పెండింగ్ బుకింగ్లను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా ‘దీపం–2’ పథకం లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా సక్రమంగా సాగాలన్నారు. డెలివరీ సిబ్బంది ప్రవర్తన, వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులతో చర్చించారు. సమావేశంలో డీఎస్వో వి.భాస్కరరావు, ఏఎస్వోలు శ్రీహరి, రుక్మిణి కళ్యాణి, పలు కంపెనీల సేల్స్ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.


