నేవీ ఎమ్యునిషన్ వర్క్షాప్నకు శంకుస్థాపన
సాక్షి, విశాఖపట్నం : తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి సంబంధించిన ఆయుధ సంపత్తి నిర్వహణకు అవసరమైన వర్క్షాప్ నిర్మాణానికి విశాఖలో కీలక అడుగు పడింది. ఎన్ఏడీ జంక్షన్లోని నేవల్ ఆర్మ్డ్ డిపో ఆవరణలో ఈ వర్క్షాప్ని నిర్మించేందుకు ఈఎన్సీ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ ఆపరేషన్స్ రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా శుక్రవారం శంకుస్థాపన చేశారు. భారత నౌకాదళ చరిత్రలో ఎమ్యునిషన్ వర్క్షాప్ని అత్యాధునిక భద్రత సాంకేతికతతో నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వర్క్షాప్ పూర్తయిన తర్వాత.. తూర్పు నౌకాదళంతో పాటు ఇండియన్ నేవీ భద్రతా ప్రమాణాలు, ఆయుధ సంపత్తి నిల్వ సంసిద్ధత, లాజిస్టిక్ వ్యవహారాల్లో గణనీయ మార్పులు చోటుచేసుకోనున్నాయని రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏడీ అధికారులు పాల్గొన్నారు.


