
● పట్టుబడ్డ ఒడిశా బోటు ఇంజిన్లు మాయం ● అక్రమార్కుడితో చ
సాక్షి, విశాఖపట్నం: వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూర్చడం కంటే.. తమ సొంత వాణిజ్యంపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తూ పట్టుబడితే చాలు.. సంబంధిత వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంటోంది. ఇటీవల ఒడిశా నుంచి అనధికారికంగా తీసుకొచ్చిన బోటు ఇంజిన్ల వ్యవహారం కొందరు సిబ్బందికి కాసుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. రెండు వాహనాల్లో నిండుగా ఇంజిన్లు పట్టుబడగా.. కేవలం మూడు ఇంజిన్లు మాత్రమే దొరికినట్లు అధికారిక లెక్కల్లో చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది. మిగిలిన వ్యవహారాన్ని అక్రమార్కులతో బేరసారాలు ఆడి చక్కదిద్దినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే.?
ఒడిశా ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి మత్స్యజీవి కల్యాణ యోజన(ఎంఎంకేవై)’పథకంలో భాగంగా మత్స్యకారులకు కొత్త బోట్లు, ఇంజిన్లు, వలల కొనుగోలుకు రాయితీ అందిస్తోంది. సుమారు రూ.1.50 లక్షల విలువైన ఒక్కో బోటు ఇంజిన్ను రూ.84 వేల రాయితీతో కేవలం రూ.66 వేలకే ఇస్తోంది. బహిరంగ మార్కెట్లో ఈ ఇంజిన్ కొనాలంటే అదనంగా జీఎస్టీ భరించాల్సి ఉంటుంది. ఇదే అదనుగా భావించిన విశాఖకు చెందిన ఓ వ్యాపారి ఒడిశాలో మత్స్యకారులకు రాయితీపై అందిన బోట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఎలాంటి జీఎస్టీ చెల్లించకుండా వాటిని ఇక్కడకు తీసుకొస్తున్నాడు. గత ఆరు నెలలుగా నెలలుగా ఈ దందా గుట్టుగా సాగుతోంది. విశాఖపట్నంతో పాటు పూడిమడక, నక్కపల్లి, అచ్యుతాపురం తదితర ప్రాంతాల మత్స్యకారులకు వీటిని అమ్ముతున్నట్లు సమాచారం.
వ్యాపారితో బేరసారాలు : పట్టుబడిన ఒక వాహనంలో ఇతర సామగ్రితో పాటు 3 ఇంజిన్లు ఉండగా, మరో వాహనంలో 15 ఇంజిన్లు ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న వ్యాపారి.. తన దుకాణం ఉన్న సర్కిల్ అధికారుల వద్దకు పరుగున వెళ్లాడు. అక్కడి నుంచి సిబ్బందితో కలిసి కమర్షియల్ ట్యాక్స్ డివిజనల్ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. పట్టుకున్న సిబ్బందితో వ్యాపారి బేరసారాలు ఆడినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రెండు వాహనాలను వదిలిపెట్టేందుకు భారీగా ముడుపులు ముట్టజెప్పుతానని వ్యాపారి ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే రెండు వాహనాలనూ వదిలేస్తే తమకు సమాచారం ఇచ్చిన వ్యాపారులకు అనుమానం వస్తుందని భావించిన సిబ్బంది.. కేవలం 3 ఇంజిన్లు ఉన్న వాహనాన్ని మాత్రమే పట్టుకున్నట్లు చూపిస్తామని చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో వాణిజ్య పన్నుల శాఖ ఇంటెలిజెన్స్ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేసినట్లు ఆరోపణలున్నాయి. అనంతరం ఈ కేసును గుట్టుచప్పుడు కాకుండా మూసివేశారు. కేవలం 3 ఇంజిన్లు మాత్రమే పట్టుబడ్డాయని, అందులో ఒకదానికి బిల్లు ఉందని, మిగిలిన రెండు ఇంజిన్లకు బిల్లులు లేకపోవడంతో జరిమానా విధించి వదిలేశామని ఇంటెలిజెన్స్ సిబ్బంది కేసును ముగించారు. ఎక్కువ ఇంజిన్లు ఉన్న వాహనాన్ని రాత్రికి రాత్రే ఆ వ్యాపారి తన దుకాణానికి తరలించుకుపోయినట్లు తెలిసింది. చిన్న గార్మెంట్ బేల్స్ పట్టుకుంటేనే హడావిడి చేసే అధికారులు.. బోటు ఇంజిన్లు పట్టుబడ్డా, విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. మొత్తంగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన లక్షల రూపాయల జీఎస్టీని కొందరు అధికారులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పన్నుల శాఖలో
సొంత వాణిజ్యం
తోటి వ్యాపారుల సమాచారంతో..
పెద్ద సంఖ్యలో ఇంజిన్లు తెచ్చి తక్కువ ధరకు విక్రయిస్తున్న వ్యాపారి తీరుపై తోటి బోట్ ఇంజిన్ వ్యాపారులకు అనుమానం కలిగింది. పక్కా సమాచారం సేకరించి.. ఏ సమయంలో, ఎన్ని వాహనాల్లో ఇంజిన్లు వస్తున్నాయన్న వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందించారు. దీంతో కమర్షియల్ ట్యాక్స్ సిబ్బంది వలపన్ని జూలై 31న ఆరిలోవ సమీపంలో రెండు వాహనాలను పట్టుకున్నారు. వాస్తవానికి ఒడిశా నుంచి మూడు వాహనాల్లో ఇంజిన్లు రాగా.. ఒక వాహనాన్ని ఆ వ్యాపారి శ్రీకాకుళంలోని తన దుకాణానికి ముందే తరలించేశాడు. మిగిలిన రెండు వాహనాలను విశాఖ వాణిజ్య పన్నుల శాఖ బృందం పట్టుకుంది. ఇక్కడే అసలు కథ మొదలైంది.