
ఉగ్రదాడి దేశానికి క్షోభ కలిగించింది
ఇది ముమ్మాటికీ హిందువులపై దాడి: పవన్ కల్యాణ్
ఏయూ క్యాంపస్: కశ్మీరులో ఉగ్రదాడి దేశం మొత్తానికి క్షోభ కలిగించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రదాడిలో మరణించిన విశాఖకు చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని గురువారం రాత్రి ఆయన పరామర్శించారు. తొలుత ఆస్పత్రిలోని చంద్రమౌళి మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాంతం, భాష, మతం అడిగి చంపటం అమానుషమన్నారు. హిందువులను టార్గెట్ చేసి చంపారని, దీనిపై మనమంతా ఏకతాటిగా నిలవాలన్నారు. భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కించపరిచేలా ఎవరైనా సోషల్మీడియాలో మాట్లాడినా, కామెంట్లు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. పోయిన ప్రాణాలు తిరిగి రావని, భవిష్యత్లో ఇలాంటి దాడులు జరుగకుండా కేంద్ర ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. యుద్దం మొదలుపెడితే అది ఎవరి చేతుల్లోనూ ఉండదనే విషయాన్ని గుర్తించాలన్నారు.