తాండూరు టౌన్: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తాండూరు ఆర్డీఓ అనిత సూచించారు. శుక్రవారం పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఆర్అండ్బీ, ఇరిగేషన్ తదితర శాఖలు, హిందూ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు రోజులు నిర్వహించనున్న వినాయక ఉత్సవాలు తదనంతర నిమజ్జన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాల్లో భక్తులకు ఏమాత్రం లోటు రాకుండా చూసుకోవాలన్నారు. మంటపాలు, నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా కొనసాగేలా నిర్వాహకులు, హిందూ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు, ప్రభాకర్ గౌడ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
నిమజ్జన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దు
పీస్ కమిటీ సమావేశంలో ఆర్డీఓ అనిత


