చేవెళ్ల: వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని చేవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి అన్నారు. పట్టణంలోని ఆదర్శ కళాశాల వసతిగృహం విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సరఫరా చేసిన నిత్యావసర వస్తువులు ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు, జగ్గులు, బెడ్షీట్లు, ట్రంక్ పెట్టెలు తదితర సామగ్రిని స్తానిక కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్తో కలిసి శుక్రవారం ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను, వసతిగృహాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని, తల్లిదండ్రులు, కళాశాలతోపాటు ప్రభుత్వానికి గుర్తింపు వస్తుందని తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు తీసిపోని విధంగా ప్రభుత్వం విద్యారంగాన్ని పురోగమనం వైపు నడిపిస్తోందన్నారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. స్థానికంగా కళాశాలకు, విద్యార్థులకు అందుబాటులో ఉంటామని ఎలాంటి, ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


