నెల రోజుల్లో ముగియనున్న వర్షాకాలం
వికారాబాద్: ఈ సారి చేప పిల్లలు చెరువుకు చేరడం కష్టంగానే కనిపిస్తోంది. మరో నెల రోజుల్లో వర్షాకాలం ముగియనుంది. ఇప్పటి వరకు టెండర్లు కానీ.. చేప పిల్లల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. చెరువుల్లోకి వదులుతారా లేదా అనే సందేహం మత్స్య సహకార సంఘాల్లో నెలకొంది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు మాత్రం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి.. అనుకూలంగా ఉన్నవి ఎన్ని అనే వివరాలు సేకరించారు. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి కూడా అందజేశారు. టెండర్ల ప్రక్రియపై స్పష్టత లేకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
14.97లక్షల రొయ్య పిల్లలు
జిల్లాలో మొత్తం 1,179 చెరువులు, కుంటలు ఉండగా చేపల పెంపకానికి 779 అనుకూలమని గుర్తించారు. వీటిలో 1.29 కోట్ల చేప పిల్లలు, 14.97 లక్షల రొయ్య పిల్లలు వదలాలని లక్ష్యం పెట్టుకున్నారు. 152 మత్స్య సహకార సంఘాలు.. 5,665 మంది సభ్యులు ఉన్నారు. ఎల్నినో ప్రభావంతో ఈ సారి వర్షాలు తగ్గిన విషయం తెలిసింది. ఇది కూడా చేప పిల్లల పెంపకంపై ప్రభావం చూపుతోంది. పెద్ద చెరువుల్లో నీరు బాగానే ఉంది. కొన్నింటిలో 75 శాతం మేర నీరు ఉంది. ఇలాంటి చెరువుల్లో చేప పిల్లలు వదలవచ్చని మత్స్య సహకార సంఘాల సభ్యులు కోరుతున్నారు.
జిల్లాలో మొత్తం చెరువులు 1,179,
ఎంపిక చేసినవి 779
వదలాల్సిన చేప పిల్లలు 1.29 కోట్లు
మత్స్య సహకార సంఘాలు 152
ఏటా లక్ష్యానికి దూరమే..
చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో చేపపిల్లలు వదిలే విషయంలో అధికారులు ఎంచుకున్న లక్ష్యానికి వదులుతున్న దానికి ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. ఏటా ఇదే తంతు కనిపిస్తోంది. ఎంచుకున్న లక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకే వదిలి చేతులు దులుపుకొంటున్నారు. ఎక్కువ శాతం నాసిరకం పిల్లలను వదులుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగా చేపల ఎదుగుదల సరిగ్గా ఉండలం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన పిల్లలను వదిలితే దిగుబడి బాగా వస్తుందని అంటున్నారు.


