యాలాల: ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ను స్థానికులు దేహశుద్ధి చేసిన పోలీసులకు అప్పగించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణ శివారులోని జ్యోతిరావు పూలే పాఠశాల ప్రిన్సిపల్ నరేష్, అదే పాఠశాలలో చదువుతున్న ఓ బాలుడి తల్లితో సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం యాలాల మండల పరిధిలోని అగ్గనూరు శివారులో సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో స్థానికులు గమనించి దేహశుద్ధి చేశారు. అనంతరం యాలాల పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పీఎస్కు తరలించారు. ఈ మేరకు విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు.
సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలి
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్ నరేష్ను వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం, కేవీపీఎస్ నాయకులు యాలాల పీఎస్ ఎదుట డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ వేధింపులు, అసభ్య ప్రవర్తన విషయంలో పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసిందని తెలిపారు. బీసీ సంఘం నియోజకవర్గ కన్వీనర్ రాజ్కుమార్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, నాయకులు షుకూర్, గడ్డం వెంకటేష్, మండల బీసీ సంఘం అధ్యక్షుడు లక్ష్మణచారి ఉన్నారు.
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్కు దేహశుద్ధి


