మర్పల్లి: పొదుపు సంఘాల్లోని మహిళలు కోటీశ్వరులు కావాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వ సంకల్పమని ఐకేపీ డీపీఎం కొమరయ్య, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల సమాఖ్య అధ్యక్షురాలు అనురాధ అధ్యక్షతన మండల సమాఖ్య 18వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కొమరయ్య, భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. మండల సమాఖ్య పనితీరు బాగుందని కితాబిచ్చారు. 2026 సంవత్సరంనాటికి 1,036 చిన్న సంఘాల్లో 10,317 మంది సభ్యులను చేర్పించడం అభినందనీయమన్నారు. 12 దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేసి 126 మంది సభ్యులను చేర్పించడం సమాఖ్య పనితీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది మహిళ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని మరో 40 లక్షల మంది మహిళలను సంఘాల్లో చేర్పించి కోటీశ్వరులను చేయాలనేది ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా అర్హులైన ప్రతీ కిషోర బాలికను, వృద్ధులను, దివ్యాంగులను మహిళా పొదుపు సంఘాల్లో చేర్పించేలా ఐకేపీ సీసీలు పనిచేయాలన్నారు. అంతకు ముందు మండల సమాఖ్య ఆదాయ వ్యయాలను, రుణాలను ఏపీఎం సమయ్య చదివి వినిపించారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సంరద్భంగా ఆర్అండ్బీ రోడ్డు నుంచి రైతు వేదికవరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు జ్యోతి, మమత సీసీలు పోచయ్య, సంగమ్మ, మల్లేశం, సత్యమ్మ, అక్ష్మయ్యతో పాటు సీనియర్ సహాయకులు నవీన్, కంప్యూటర్ ఆపరేటర్ నాగరాజు ఆయా గ్రామాల మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఐకేపీ డీపీఎం కొమరయ్య


