స్కూటీలు ఇస్తామని విద్యార్థినులను మోసం చేసింది హామీలపై యువతకు సమాధానం చెప్పాలి తాండూరు మాజీ ఎమ్మెల్యేపైలెట్ రోహిత్రెడ్డి
తాండూరు: ఎన్నికల ముందు యువతకు, విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయలేదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో యువత, విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు లేవన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పీఠాన్ని కదిలించడం తమకు పెద్ద లెక్క కాదని, ప్రజలే సరైన సమయంలో తమ తీర్పుతో మార్పునకు నాంది పలుకుతారని అన్నారు. యువత ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే రాజకీయాల దిశనే మార్చగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సందల్రాజుగౌడ్, మున్సిపల్ కౌన్సిల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప, కౌన్సిలర్లు నీవీన సంతోష్గౌడ్, ఇర్షద్, జావీద్, సురేష్, మాజీ కౌన్సిలర్లు అనురాథ, పరిమళ, శోభరాణి, నరేందర్గౌడ్, నాయకులు పట్లోళ్ల నర్సింహులు, శ్రీనివాసాచారి, ఇందర్చెడ్ రాజు, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.


