బషీరాబాద్: ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులు ఫారం – 6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించినట్లు బషీరాబాద్ తహసీల్దార్ షాహేదా బేగం శనివారం తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామా, ఇతర వివరాల్లో పొరపాట్లు ఉంటే సంబంధిత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారాల ద్వారా ఆయా గ్రామాల్లోని పోలింగ్ బూతుల వారీగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండలంలోని కాశీంపూర్, మల్కన్గిరి, బాద్లాపూర్, గొట్టిగ ఖుర్ధు, దామర్చెడ్ గ్రామాల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలన్నారు. పేరు తొలగింపు అభ్యంతరాలకు ఫారం –7, వివరాల సవరణకు ఫారం –8 వినియోగించుకోవచ్చని తెలిపారు. బూత్స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని, అవసరమైతే ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే నోటీసులు అందుకున్న వారు సరైన ధ్రువపత్రాలను బీఎల్ఓలకు సమర్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు కావడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఐ సుధ, జీపీఓలు, బీఎల్ఓలు పాల్గొన్నారు.


