కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సక్రమంగా అందని జీతాలు
వికారాబాద్: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన వెతలు తప్పడంలేదు. వివిధ శాఖల్లో పని చేస్తున్న సిబ్బందికి జీతాలు సక్రమంగా అందడంలేదు. ఒక్కోసారి రెండు నుంచి ఆరు నెలల ఆలస్యం అవుతోంది. ఇటీవల కాలంలో ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు వారం పది రోజులు ఆలస్యమైతే ఆగ్రహం వ్యక్తం చేసే సంఘాల నాయకులు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల విషయంలో నోరు మెదపడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఆరోగ్య, విద్య శాఖల్లో, డీఆర్డీఏలో విధులు నిర్వహిస్తున్న వందలాది మంది జీతాల కోసం అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ కష్టంగా ఉందని వాపోతున్నారు. అప్పులు చేసి నెట్టుకురావాల్సి వస్తోందని తెలిపారు.
డాక్టర్లు మొదలుకొని..
కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న వారిలో డాక్టర్లు మొదలుకొని ఏఎన్ఎంలు, జూనియర్ ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, లెక్చరర్లు ఉన్నారు. విద్యాశాఖలో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. నెలనెలా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ సమస్యను చక్కదిద్దారు. ప్రస్తుతం పాత పరిస్థతి తలెత్తుతోంది. కొన్ని శాఖల్లో రెండు మూడు నెలలు, మరి కొన్ని శాఖల్లో నాలుగు నెలలకు పైగానే జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. మండల విద్యావనరుల కేంద్రాల్లో, కస్తూర్బా గాంధీ గురుకులాల్లో విధులు నిర్వహించే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. సీఆర్పీలు, ఎంఐసీలు, పీటీఐలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఐఈఆర్సీలు కూడా ఉన్నారు.
అప్పులు పుట్టడంలేదు
నెల రోజులు కష్టపడ్డా జీతం అందకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోందని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పది నుంచి ఇరవై ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా గుర్తింపు లేదన్నారు. క్రమబద్దీకరించాలని కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొన్నారు. ప్రస్తుతం అప్పులు కూడా పుట్టని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. వేతనాల విషయంలో వివక్ష చూపడం తగదని వేడుకుంటున్నారు. పరిస్థి తి ఇలాగే కొనసాగితే రోడ్లపైకి వస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు డీఏ, పీఆర్సీ, ఇతర పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మూడు నుంచి
ఆరు నెలల వరకు పెండింగ్
విద్య, వైద్యం, డీఆర్డీఏ
ఉద్యోగుల అవస్థలు
ఒక్కో శాఖలో 120 నుంచి 200 వరకు సిబ్బంది
అప్పులు చేసి కుటుంబాలను
నెట్టుకొస్తున్న వైనం..


