తాండూరు: నిత్యం వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. మహిళలకు ఆర్థిక భారం పడకుండా ఉచిత ప్రయాణంతో మరింత చేరువైంది. అలాంటి ఆర్టీసీ నాలుగు నెలలుగా నష్టాల బాటలో నడుస్తోంది. ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదు. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలతో ప్రతి నెలా భారంగా మారుతోంది. దీంతో అధికారులు లాభాల బాట పట్టించేందుకు ప్రత్నామ్నాయలు మొదలు పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తాండూరు ఆర్టీసీ డిపోకు ఏకంగా రూ.5.76 కోట్ల మేర నష్టం వాటిల్లింది. డిపోలో మొత్తం 92 బస్సులు ఉండగా అందులో 32 అద్దె బస్సులు ఉన్నాయి. నిత్యం 46 రూట్లలో.. 35వేల కిలోమీటర్లు తిరుగుతూ.. 46వేల మంది ప్రయాణికులను గమ్యాలకు చేరుస్తోంది. తద్వారా డిపోకు రోజు రూ.17 లక్షలు సమకూరుతోంది. టికెట్ల రూపంలో రూ.9 లక్షలు, మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా మరో రూ.8 లక్షలు వస్తోంది. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోని దుకాణాల ద్వారా నెలకు రూ.2.65 లక్షల ఆదాయం వస్తోంది.
నాలుగు నెలల్లో రూ.5.76 కోట్ల నష్టం
తాండూరు ఆర్టీసీ డిపో నిర్వహణ ప్రతి నెలా భారంగా మారుతోంది. బస్సుల మరమ్మతులు, ఉద్యోగుల వేతనాలు మేరకు కూడా అదాయం రావడం లేదని అధికారులు అంటున్నారు. ప్రతి నెలా సగటున రూ.5కోట్ల ఆదాయం వస్తుండగా 32 బస్సుల అద్దెలు, డీజిల్ ఽకొనుగోలు, ఉద్యోగుల వేతనాల, మరమ్మతులకు రూ.6.56 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. దీంతో ప్రతి నెలా రూ.1.56 కోట్ల మేర అదనంగా భరించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నేటి వరకు రూ.5.76 కోట్ల నష్టం వచ్చిందన్నారు.
తాండూరు బస్టాండ్
ప్రతి నెలా రూ.1.56 కోట్ల భారం


