తాండూరు టౌన్: మతం మారిన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండాల్సిందేనని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆలిండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక విలియంమూన్ స్కూల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతం మారిన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దవుతుందని కోర్టు ఇచ్చిన తీర్పు సరికాదన్నారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 341 ఆర్టికల్ను పార్లమెంటులో సవరించాలని డిమాండ్ చేశారు. మతం మారిన ఓసి, బిసి, ఎస్టీలకు లేని ఆంక్షలు కేవలం దళిత క్రైస్తవులకే ఎందుకని ప్రశ్నించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరపాగ గోవింద్, కోశాధికారి మోహనకృష్ణ మాట్లాడుతూ కుల వివక్ష ఉన్నన్ని రోజులూ దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ ఉండాల్సిందేనన్నారు. సమావేశంలో జిల్లా పాస్టర్ల సంఘం అధ్యక్షుడు జనార్దన్, పాస్టర్లు జోసెఫ్, ఆశీర్వాదం, నాయకులు చక్రవర్తి, కిష్టప్ప, లక్ష్మయ్య, మల్లేశ్, మధు తదితరులు పాల్గొన్నారు.


