మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి
పరిగి: కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు అరచేతిలో అద్బుతం చూపించి అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో బీఆర్ఎస్ నియోకవర్గ ముఖ్యనాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ పిలపు మేరకు నేటి నుంచి 8 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వేయి రోజుల దగా పాలనపై సమరభేరి ఉంటుందన్నారు. కాంగ్రెస్ 420 హమీలను ప్రజలకు గుర్తు చేస్తూ ప్రభుత్వంపై పోరాడడానికి ప్రతీ కార్యకర్త సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరవింద్రావు, నాయకులు కొప్పుల నాగిరెడ్డి, శ్యాంసుందర్రెడ్డి ప్రవీణ్రెడ్డి, శివనోళ్ల భాస్కర్, ఆయా మండలాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తుర్కయంజాల్: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కిరాణ దుకాణం దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల సర్కిల్ పరిధి కమ్మగూడలోని లక్ష్మీనగర్ కాలనీలో కిరాణ దుకాణం నిర్వాహకులు మంగళవారం మధ్యాహ్నం షాపు మూసి భోజనానికి వెళ్లారు. కొద్ది సేపటికే దుకాణం నుంచి పొగలు వస్తుండడం గమనించిన స్థానికులు విషయాన్ని నిర్వాహకులకు తెలియజేశారు. వెంటనే హయత్నగర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సుమారు రూ.లక్షన్నరకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడం, అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
3 తులాల బంగారం, 30 తులాల వెండి అపహరణ
శంకర్పల్లి: తాళం వేసి ఊరికి వెళ్లిన ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని అయ్పప్పరెడ్డిగూడలో సరస్వతి అనే మహిళ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గతనెల 30న ఇంటికి తాళం వేసి వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం దుర్గం చెరువుకి తన కూతురు, అల్లుడుతో కలిసి రాఖీ కట్టేందుకు వెళ్లింది. మంగళవారం ఉదయం ఇంటి తాళం పగులగొట్టి ఉందని స్థానికులు ఆమెకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఇంటికి చేరుకొని దొంగతనం జరిగినట్లు గుర్తించింది. బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, 30 తులాల వెండి, కొంత నగదు దొంగలు అపహరించుకొని వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.


