బషీరాబాద్: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. పైకప్పు ఎప్పుడు కూలిపోతుందోననే ఆందోళన వీరిని వెంటాడుతోంది. సోమవారం రాత్రి ఓ గదిలో మరోసారి పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. రాత్రివేళ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం ఆఫీసు తెరిచిన సిబ్బంది అధికారుల గదిలో పడిన కొన్ని శిథిలాలను బయట పడేశారు. అనంతరం తహసీల్దార్ షాహెదాబేగం, ఆర్ఐ నాగార్జున రెడ్డి ఇతర గదులను పరిశీలించగా పలుచోట్ల పైకప్పు పెచ్చులు వదులుగా కనిపించాయి. దీంతో ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని వదులుగా ఉన్న పెచ్చులను సిబ్బందితో ముందుజాగ్రత్తగా తొలగింపజేశారు. తరుచూ ఇదే తరహా ఘటనలు చోటుచేసుకోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. కార్యాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, ఎప్పుడు ఏ భాగం కూలుతుందోనని హడలిపోతున్నారు. ప్రతిరోజూ ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే కార్యాలయం కావడంతో శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, అవసరమైతే ఆఫీసును మరో భవనంలోకి మార్చాలని సిబ్బంది కోరుతున్నారు.
శిథిలావస్థలో బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం
తరచూ ఊడిపడుతున్న స్లాబ్ పెచ్చులు
భయంభయంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది


