షాద్నగర్రూరల్: వైర్లు తెగిపడడంతో రెండు పాడి ఆవులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. ఈ సంఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామశివారులో చోటచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఎలికట్ట గ్రామానికి చెందిన ఆర్ల అనురాధ పాడి ఆవులపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఎప్పటిలాగే గురువారం ఉదయం పాలు పిండిన తరువాత తమ వ్యవసాయ పొలంలో మేతకోసం రెండు పాడి ఆవులను కట్టేసి ఇంటికి వెళ్లింది. తిరిగి వచ్చే సరికి విద్యుత్ తీగలు తెగి పడటంతో మృతి చెంది కనిపించాయి. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పాడి ఆవులు మృత్యువాత పడటంతో మహిళా రైతు బోరున విలపించింది. పొలంలో చేతికి అందే ఎత్తులోనే విద్యుత్ తీగలు ఉన్నాయని, సరి చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యంగానే ఆవులు మృతి చెందాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన పాడి ఆవుల విలువ రూ.2లక్షలపైనే ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


