జిల్లాలో కొత్త పింఛన్ల కోసం వెల్లువెత్తిన అర్జీలు
గడువు పొడిగింపు
బషీరాబాద్: పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఎంతన్నది తేలింది. జిల్లాలో కొత్త పింఛన్ల కోసం 14,167 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం పెట్టిన గడువు సోమవారంతో ముగిసింది. చివరి రోజు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 10,090మంది వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. మరో 4,077 మంది వివిధ కేటగిరీల్లో అర్జీలు సమర్పించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో వితంతువులు ఎక్కువగా ఉన్నారు. కుటుంబ ఆధారం లేని ఒంటరి మహిళల నుంచి 827, దివ్యాంగుల నుంచి 2,852, నేత కార్మికుల నుంచి 20, గీత కార్మికుల నుంచి 378 అర్జీలు వచ్చాయి. అధికారులు వీటిని ఆన్లైన్లో నమోదు చేశారు. తాండూరు మున్సిపాలిటీతో పాటు తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే తాండూరు నుంచి 4,657 దరఖాస్తులతో మొదటి స్థానంలో నిలిచింది. పరిగిలో 3,949, వికారాబాద్లో 2,905, కొడంగల్లో 2,656 అర్జీలు నమోదయ్యాయి. వితంతు పింఛన్లకు తాండూరు నుంచి 3,381, పరిగి నుంచి 2,684, వికారాబాద్ నుంచి 2,081, కొడంగల్ నుంచి 1,944 దరఖాస్తులు వచ్చాయి.
ఇప్పటికే 1.07లక్షల మందికి..
జిల్లాలో ఇప్పటికే 1,07,113 చేయూత పింఛన్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 48,508 వితంతు పింఛన్లు ఇస్తున్నారు. తాజాగా మరో 10,090 మంది దరఖాస్తు చేసుకోవడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
‘వృద్ధాప్య’ పింఛన్కు కొత్త అర్జీలు లేవు
జిల్లాలో ఇప్పటికే సుమారు 40 వేల మందికి వద్ధాప్య పింఛన్లు అందుతున్నాయి. ఈసారి ప్రభుత్వం వద్ధాప్య పింఛన్లకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించలేదు. నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే వద్ధాప్య పింఛన్ పొందే అవకాశం ఉంది. భార్య లేదా భర్త మరణించిన సందర్భంలో.. ఆ కుటుంబంలో అర్హత ఉన్న మరో వ్యక్తికి పింఛన్ను బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడగించింది. ఆగస్టు 31తో గడువు ముగియగా లబ్ధిదారుల సౌకర్యార్థం మరో 15 రోజుల పాటు పొడగిస్తూ సెర్ఫ్ సీఈఓ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.


