కడ్తాల్: కడ్తాల్ రెవెన్యూ పరిధిలో గతంలో పట్టాలు ఇచ్చిన భూదాన్ భూమి రైతులకు పొజిషన్ ఇప్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. రైతులలో కలిసి సర్వే నంబర్ 269/9లోని భూదాన్ భూములను శుక్రవారం పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో పార్టీ మండల కార్యదర్శి పెంటయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పగడాల యాదయ్య మాట్లాడారు. 2014లో సర్వేనంబర్ 260/9లో 140 ఎకరాలను 51 మంది పేద రైతులకు భూదాన్బోర్డ్ ద్వారా పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు పొజిషన్ చూపించలేదని పేర్కొన్నారు. భూదాన్ భూమిలో కొంతమంది దళారులు వారికివారే ఒప్పందాలు చేసుకుని, భూ బాధితులకు తెలియకుండా మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ భూమి పేదలకు దక్కాలని, వెంటనే పొజిషన్ చూపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు జగన్, నాయకులు ఆశీర్వాదం, పట్నం నర్సింహ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


