● వేధింపులు భరించలేక వారం రోజుల క్రితం పూడూరు మండలం ఎన్కేపల్లికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ నాయకుడు భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తానని డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. బాధితుడు డబ్బు అడిగితే పోలీసులతో ఫోన్ చేయించి బెదిరించాడని ఆరోపణ. మృతుడి తల్లి ఫిర్యాదు చేసినా నిందితుడిని సకాలంలో అరెస్ట్ చేయలేదని, రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకుని ముందస్తు బెయిల్ తెచ్చుకునేలా సహకరించారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారి ఒత్తిడి మేరకు శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సమాచారం.
● జూన్లో దోమ మండలం దొంగ ఎన్కేపల్లికి చెందిన మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మన్నెగూడలో ఉంటున్న అతను రియల్ ఎస్టేట్ అప్పుల కోసం తన 2.14 ఎకరాల భూమిని రాసిచ్చినా వేధింపులు ఆగలేదని, పోలీస్ స్టేషన్కు పిలిపించి ఇబ్బంది పెట్టారని మృతుడతి భార్య ఫిర్యాదులో పేర్కొంది.
● కుల్కచర్ల మండలం చెల్లాపూర్కు చెందిన ఓ రైతు తన పొలాన్ని కొందరు ఆక్రమించారంటూ రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నా ఆక్రమణదారులు పట్టించుకోలేదని పేర్కొన్నాడు. ఈ విషయంలో పోలీసులు స్పందించకపోగా, తనను బలవంతంగా బయటకు నెట్టి దుర్భాషలాడారని, ఫోన్ లాక్కున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
సివిల్ తగాదాల్లో తలదూరుస్తున్న పోలీసులు రియల్ వ్యాపారంలోనూ పాత్ర అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు పోలీస్ స్టేషన్లే అడ్డాగా సెటిల్మెంట్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధితులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన ప్రజా సంఘాలు
వికారాబాద్: జిల్లాలోని కొంతమంది పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.‘ఇచ్చట భూ వివాదాలు, సివి ల్ కేసులు పరిష్కరించబడవు‘ అనే బోర్డులు స్టేషన్లలో ఉన్నా, సిబ్బంది దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.కొన్నిచోట్ల రియల్టర్లకు అండగా నిలుస్తూ, మరికొన్నిచోట్ల వారే స్థిరాస్తి వ్యాపారాల్లో భాగస్వాములవుతున్నారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. చన్గొముల్ స్టేషన్లో ఇవి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఖాకీల జోక్యం కానిస్టేబుల్ నుంచి డివిజన్ స్థాయి అధికారుల వరకూ ఉంటోందనే విమర్శలున్నాయి. మర్పల్లి, నవాబుపేట, బంట్వారం, మోమిన్పేట, వికారాబాద్, పరిగి స్టేషన్ల పరిధిలోని భూ వివాదాల్లో పోలీసుల ప్రమేయం విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. చన్గొముల్ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు రెండుసార్లు ఎస్పీ స్నేహ మెహ్రను కలిసి ఫిర్యాదు చేసినా స్పందన లేదని తెలిపారు.