● అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి
పరిగి: దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి అన్నారు. శుక్రవారం పరిగి పట్టణంలో ఏఐకేఎంఎస్ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ఏడాది వర్షాలు పడక రైతులు నష్టాలు చవిచూస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎరువులు, డీజిల్ ధరలు పెంచి అన్నదాతలను నట్టేట ముంచుతోందని ఆరోపించారు. కౌలు రైతులకు గుర్తింపు లేదన్నారు. రుణభారం పెరిగి కర్షకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమయ్య, జిల్లా అధ్యక్షుడు మహేందర్, ప్రధాన కార్యదర్శి మల్లేశ్, ఉపాధ్యక్షులు రాములు, నర్సింహులు, గోపాల్, యాదయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


