అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్
కుల్కచర్ల: మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక పురోగతి సాధించడం తోపాటు.. వారు నిర్వహించే కార్యక్రమాలు రైతులకు మేలు జరిగేలా ఉండాలని అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ సూచించారు. శుక్రవారం చౌడాపూర్ మండల కేంద్రంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేయనున్న పశువుల దాణా విక్రయ కేంద్రానికి భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘాల సభ్యులతో నిర్వహించారు. మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. మండలంలో పశు సంపద, పాడి పశువులు తదితర అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సోమలింగం, ఎంఈఓ రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
వెంకటరత్నం
నవాబుపేట: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి వెంటనే ఓపీఎస్ను ప్రకటించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటరత్నం కోరారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం మండలంలోని మీనాపల్లి కలాన్ ఉన్నత పాఠశాలకు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని ప్రకటించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలకు గుదిబండగా మారిన జీఓ నం.25ను వెంటనే రద్దు చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, గోవిందమ్మ, విజయ్, మాణిక్య ప్రభు, మల్లేశం, ముస్తఫా, రవీందర్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలను శుక్రవారం రాష్ట్ర అడిషనల్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు. కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఈవీఎంలు, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని కుణ్ణంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. సంబంధిత రిజిస్టర్లలో సంతకాలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, డీఆర్ఓ స్వర్ణలత, ఆర్డీఓ వాసుచంద్ర, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
తాండూరు టౌన్: తాండూరు గోశాల సేవా సమితి, రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఆర్బీఓఎల్) ఆధ్వర్యంలో ఈ నెల 15న రైతులకు ఉచితంగా కోడెలను పంపిణీ చేయనున్నట్లు గోశాల ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సార్డా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు నియోజకవర్గ రైతులకు మాత్రమే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు గోశాలలో నిర్ణీత రుసుం చెల్లించి ఈ నెల 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కోడెలను ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9440872526, 6300383211, 9030056755లలో సంప్రదించాలన్నారు.


