● వికారాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన
● డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళన
ఆస్పత్రిలో ఆందోళన చేస్తున్న మృతుడి కుటుంబీకులు, బంధువులు
నరేష్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
అనంతగిరి: ఛాతిలో మంట రావడంతో చికిత్స కోసం వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన నరేష్(33) షాద్నగర్లో ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన సాయంత్రం స్నేహితులతో కలిసి నవాబుపేటకు వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా ఛాతిలో మంట రావడంతో మధ్యాహ్నం వికారాబాద్లోని మెడిక్యూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం నరేష్ను వైద్యులు డిశ్చార్ చేశారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన వైద్యులు పీసీఆర్ చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే నరేష్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న వికారాబాద్ సీఐ రఘుకుమార్, డీఎస్పీ అంజయ్య ఘటనా స్థలానికి చేరుకుని బాధితులు, వైద్యులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.


