పూడూరు: రెండు రోజుల క్రితం గొంగుపల్లిలో జరిగిన అనుమానాస్పద హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థికలావాదేవీలు, వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు నిర్ధారించారు. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన ప్రకారం.. చౌడాపూర్ మండలం గోగ్యానాయక్ తండాకు చెందిన నేనావత్ మంగ్యానాయక్ (43)కు అడవి వెంకటాపూర్కు దర్మ్యానాయక్ తండాకు చెందిన కాట్రావత్ విజయమ్మతో పరిచయం ఏర్పడింది. ఆమె తండాలో ఇంటి నిర్మాణం చేపట్టిన సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం తర్వాత విజయమ్మ కుటుంబంతో కలిసి నగరంలోని కిస్మత్పూర్ ప్రాంతంలో నివాసం ఉంటూ కూలీ పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో మంగ్యానాయక్ తరచూ ఫోన్ చేసి కలవాలని ఒత్తిడి చేశాడు. తనకు ఇంటి నిర్మాణ సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని.. తన కూతురు వివాహం సమీపిస్తుందని ఒత్తిడి పెంచడంతో హత్యచేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈ నెల 6న మన్నెగూడలో కలుసుకుని అక్కడి నుంచి గొంగుపల్లి సమీపంలోని అటవీప్రాంతం వైపునకు వెళ్లారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత సీతమ్మ గుడి సమీపంలో అదును చూసి బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకుంది. నిందితురాలుని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె వద్ద నుంచి రూ.40వేలు నగదు, మృతుడిని చంపడానికి ఉపయోగించిన రాయిని స్వాధీనం చేసుకుని ఆమెను రిమాండ్కు తరలించారు.
నిందితురాలికి రిమాండ్


