తాండూరు టౌన్: కూలీ పనికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తలారి హరికృష్ణది ముమ్మాటికే హత్యేనని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఈమేరకు మంగళవారం ముదిరాజ్, దళిత, మైనార్టీ, ప్రజాసంఘాల నాయకులు తాండూరులో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన యువకుడు తలారి హరికృష్ణ ఏప్రిల్ 29న పని నిమిత్తం రుద్రారం గ్రామానికి వెళ్లాడు. అదే రోజు మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎలాంటి ఆధారాలు సేకరించలేదని, ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. ఇందుకు నిరసనగా ఈనెల 11న తాండూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు రమేశ్ ముదిరాజ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, టీఎస్ఎంఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్, చంద్రయ్య, రత్నం, సాధిక్, బలరాం, రాజు, శానప్ప, శ్రీకాంత్ తదితరులు తెలిపారు.
● నిందితులను అరెస్ట్ చేయాలి
● ప్రజాసంఘాల నాయకులు


