తాండూరు టౌన్: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20, 21, 22వ తేదీల్లో మహబూబ్నగర్ పట్టణంలో మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి, వీబీజీ రాంజీ పథకాన్ని తీసుకొచ్చి చట్టాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ఉపాధి కూలీల హక్కుల రక్షణకు, సమస్యలపై పోరాటానికి, భవిష్యత్ కార్యక్రమాలపై మహా సభలో చర్చించనున్నట్లు చెప్పారు. ఈ సభలకు త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు విజయ్ రాఘవన్, రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రాములు పాల్గొంటారన్నారు. ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున సభలకు తరలి రావాలని ఆయన కోరారు.
మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరక్టర్ శ్రీనివాస్చారి
తాండూరు రూరల్: విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ రాష్ట్ర అడిషనల్ డైరక్టర్ శ్రీనివాస్చారి ప్రిన్సిపాల్ గాయత్రిని వివరణ కోరారు. శుక్రవారం పెద్దేముల్ మండలం గొట్లపల్లి స్కూల్ను ఆయన సందర్శించారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీఎం శ్రీ నిధులు.. ఖర్చుపై ఆరా తీశారు. స్కూల్ ప్రారంభ దశలో ఉన్న విద్యార్థులు ఇప్పుడు ఎందుకు లేని అడిగారు. ఇంటర్లో ఇప్పటి వరకు ఒక్క అడ్మిషన్ కూడా లేక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారులు రమణ, స్టిఫెన్ పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకరణ
కడ్తాల్: స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా మండల కేంద్రానికి చెందిన ఎండీ అసీఫ్అలీ హైదరాబాద్ సోమాజీగూడలోని రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యాలయంలో తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎస్ఎఫ్సీ కమిషన్ సెక్రటరీ కాత్యాయణిదేవి సమక్షంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ అధికారులతోపాటు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు.


