కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు.. ఢిల్లీలో ఉత్కంఠ! | Cockroach Janata Party Protest At Jantar Mantar | Sakshi
Sakshi News home page

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు.. ఢిల్లీలో ఉత్కంఠ!

Jun 6 2026 7:27 AM | Updated on Jun 6 2026 8:35 AM

Cockroach Janata Party Protest At Jantar Mantar

సాక్షి, న్యూఢిల్లీ: నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ‘కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)’ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద తలపెట్టిన ఆందోళనపై అత్యవసర విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. నిరసనను అడ్డుకోవాలని శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ ‘సేవ్‌ ఇండియా ఫౌండేషన్‌’ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) తోసిపుచ్చింది.

ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా ఆవిర్భవించిన సీజేపీ విదేశీ సర్వర్ల ద్వారా దేశంలో అస్థిరత సృష్టించేందుకు కుట్ర చేస్తోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. యువతను రెచ్చగొట్టేలా ఆన్‌లైన్‌లో పోస్టులు పెడుతున్నారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, జాతీయ రహదారుల వద్ద ముందు జాగ్రత్తగా భద్రతా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ నిరసనకు అనుమతి నిరాకరించాలని లేదా వేరే ప్రాంతానికి మార్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

వాదనలు విన్న జస్టిస్‌ సౌరభ్‌ బెనర్జీ, జస్టిస్‌ అమిత్‌ శర్మల వెకేషన్‌ బెంచ్‌ ఈ పిల్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. ఆందోళనకు సంబంధించిన ప్రస్తుత దశలో ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు పిటిషన్‌ను విచారణ జాబితాలో చేర్చేందుకు నిరాకరిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. జంతర్‌ మంతర్‌ వద్ద జరిగే నిరసనకు తరలి రావాల్సిందిగా దేశంలోని యువతకు దిప్కే సోషల్‌ మీడియా వేదికగా ఇటీవల పిలుపునివ్వడం తెల్సిందే. అంతేకాదు, 6న ఢిల్లీకి వస్తున్న తనను విమానాశ్రయం వద్దే కలుసుకోవాలని కూడా అతడు కోరాడు.  


 

Advertisement
 
Advertisement
Advertisement