జిల్లా వ్యాప్తంగా పశువుల వివరాలు
దుద్యాల్: పశువులకు సంక్రమించే ప్రాణాంతకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు ప్రభుత్వ చర్యలు ఊపందుకున్నాయి. ఈ వ్యాధికి టీకాలు అందించే కార్యక్రమం ఈ నెల 10న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. జిల్లాలో అన్ని రకాల పశువులు మొత్తం 7.20 లక్షల వరకు ఉన్నాయి. ప్రతి గ్రామంలో పాడి రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి సిబ్బంది గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
వ్యాధి ఎలా వస్తుంది
● గాలికుంటు పికోర్నా విరిడే కుటుంబానికి చెందిన అప్తోస్ వైరస్ వల్ల వస్తుంది. వ్యాధి సోకిన ఆవులు, గేదెలు పాల ద్వారా దూడలకి వ్యాపిస్తుంది.
● కలుషితమైన నీరు, ఆహారం(మేత, దాణా) ద్వారా వ్యాప్తిస్తుంది. వ్యాధి సోకిన పశువుల లాలాజలం, మలమూత్రలతో కూడా వస్తుంది. వ్యాధి సోకిన పశువులను ఆరోగ్యంగా ఉన్న వాటితో ఉంచడంతో సంక్రమిస్తుంది.
పశువులకు కలిగే నష్టాలు
● పాడి పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది.
● ఎద్దులు, దుక్కి దున్నే పశువుల కాళ్లు కుంటుపడడంతో అవి పొలం పనులకు పనికిరావు.
● లేత వయసు గల దూడలలో ఈ వ్యాధి ప్రాణాంతకరంగా మారుతుంది.
● గర్భంతో ఉన్న పశువులకు వ్యాధి సోకితే గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది.
● నోటిలో పుండ్లు ఏర్పడడంతో అవి సరిగ్గా తినలేవు. దీంతో విపరీతమైన నీరసంతో బరువు తగ్గుతాయి.
● కోలుకున్న తర్వాత కూడా కొన్ని పశువులలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది.
ఇటీవల రెండు మృతి
దుద్యాల్ మండల కేంద్రంలో గాలికుంటు వ్యాధి సంక్రమించి రెండు పశువులు మృత్యువాత పడ్డాయి. వ్యాధి సోకిన పశువులకు సరైన వైద్యం అందక మృతి చెందాయి. మండల కేంద్రంలో పశువుల ఆసుపత్రి ఉన్న వైద్యులు లేకపోవడం కూడా ఒక కారణమే. నిపుణులు అందుబాటులో ఉండి చికిత్స అందించి ఉంటే ఆవులు మరణించేవి కావని పాడి రైతులు వాపోతున్నారు.
పశువులకు ప్రాణాంతకంగా గాలికుంటు వ్యాధి
గ్రామాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం
సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ సూచన
ఆవులు: 1.60లక్షలు
గేదెలు: 80 వేలు
గొర్రెలు: 2.20లక్షలు
మేకలు: 2.60లక్షలు
టీకాలు తప్పనిసరి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న గాాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం టీకాల కార్యక్రమం 100 పశువుల ఆసుపత్రుల్లో కొనసాగుతుంది. పశుసంవర్ధక శాఖలో పని చేస్తున్న సిబ్బంది 50 బ్యాచ్లుగా సేవలందిస్తున్నారు.
– సదానందం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి


