కుల్కచర్ల: వివాహేతర సంబంధం ఓ యు వకుడిని బలిగొంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డె రమేశ్(22)కు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం ఉంది. గతంలో కుటుంబ సభ్యులు మందలించడంతో రమేశ్ ఆమెను దూరంగా పెట్టాడు. కానీ కొంతకాలంగా ఆమె యువకుడికి ఫోన్ చేస్తూ ఇబ్బందులకు గురిచేసేంది. ఈ క్రమంలో 13వ తేదీ సాయంత్రం ఫోన్ చేసి రమేశ్ను పిలిపించుకుంది. అదే సమయంలో మాటువేసిన సదరు మహిళ కుటుంబసభ్యులు(అన్న, తమ్ముడు, భర్త) రమేశ్ను తీవ్రంగా కొట్టడంతో అక్కడి నుంచి ఎటో పారిపోయాడు. దీంతో మనస్తాపంతో అతడు ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. ఈ మేరకు తన కొడుకు మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి సత్యమ్మ కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు.
ఆత్మరక్షణకు కరాటే దోహదం
కొడంగల్ రూరల్: చదువుతోపాటు విద్యార్థులు క్రీడలు కరాటేలో రాణించడం ద్వారా ఆరోగ్యంతోపాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని సెకండ్ ఎస్ఐ సత్యనారాయణరాజు అన్నారు. ఆదివారం కేఎస్ఎస్ కరాటే అకాడమి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కరాటే గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. పెద్దనందిగామ, రుద్రారం, చిట్లపల్లి యూపీఎస్, మాటూర్ యూపీఎస్, అప్పాయిపల్లి యూపీఎస్లకు సంబంధించిన 60 మంది విద్యార్థులు కరాటే గ్రేడింగ్ టెస్ట్లో పాల్గొన్నారు. ప్రతిభ చాటిన చిన్నారులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రీడలు మానసికోల్లాసం కలిగిస్తాయని, తద్వారా విద్యార్థులు చదువులో రాణించేందుకు అవకావం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్లు శ్రీనివాస్, మల్లేశ్, మోనిశ్ తదితరులు పాల్గొన్నారు.
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
మేడిపల్లి: కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. చెంగిచెర్ల గణేష్నగర్కు చెందిన ఎల్లయ్య (37) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని పెద్దకుమారుడు వెంకటేష్ (19) ఓ యువతితో ఫోన్లో తరచుగా మాట్లాడుతుండటంతో తండ్రి ఎల్లయ్య మందలించాడు. ఈనెల 9న రాత్రి కుమారుడిని మందలించాడు. మనస్తాపానికి గురైన వెంకటేష్ మరుసటిరోజు తెల్లవారు జామున ఇంటినుండి వెళ్లి పోయాడు. ఈ క్రమంలో శనివారం తండ్రి ఎల్లయ్య ఇంటి వెనకభాగంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. అక్కడ చెట్టుకు వేలాడుతున్న ఓ మృతదేహాన్ని గమనించి దగ్గరకు వెళ్లి చూడగా అది వెంకటేష్దేనని గుర్తించాడు. అప్పటికే మృతదేహం కుళ్లిన స్థితి లో ఉంది. స్థానికుల సహాయంతో మృత దేహా న్ని కిందకు దించారు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటక బస్సు ఢీకొని యాచకురాలి మృతి
గచ్చిబౌలి: కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఓ యాచకురాలిని ఢీకొనడంతో మృతి చెందింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. మహబూబ్నగర్ జిల్లా తూమ్కుంటకు చెందిన పి.బాలమణి(68) గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద కొద్ది సంవత్సరాలుగా భిక్షాటన చేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వావాహనాల వద్ద యాచిస్తోంది. ఈ క్రమంలో గ్రీన్ సిగ్నల్ పడటంతో ఆర్టీసీ బస్సుఆమెను ఢీ కొట్టింది. రెండు కాళ్లపై నుంచి బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కొద్ది సేపటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.


