కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం
● అనేక పథకాలకు రూపకల్పన చేసిన ఘనత మాదే
● పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్
పూడూరు: కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని, బడుగు బలహాన వర్గాలకు అండగా ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షులతో కలిసి పూడూరు, మీర్జాపూర్ గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పేదవాడు తినడానికి తిండి ఉండాలంటే ఏడాదికి వంద రోజుల పని అవసరమనే ఆశయంతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకోచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తమకు కూలి సరిపోవడం లేదని, పనిచేసే చోట సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని కూలీలు మహేశ్కుమార్గౌడ్ దృష్టికి తెచ్చారు. కూలీల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పింఛన్ వ్యవస్థను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిందని గుర్తుచేశారు. సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీర్జాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలించి బిల్లులపై ఆరా తీశారు. నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అభివృద్ధిలో పరిగి భేష్
అభివృద్ధిలో పరిగి నియోజకవర్గం దూసుకుపోతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి కృషితో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అనంతరం అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జరుగుతున్న నాలుగు వరుసల రోడ్డు పనులను పరిశీలించారు. రూ.వెయ్యి కోట్లతో పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 17 నుంచి కోస్గి, బీజాపూర్ వరకు ఆరు లేన్ల రహదారి నిర్మాణం, ట్రిపుల్ ఆర్ పరిగి సమీపం నుంచి పోవడం ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే ఇక్కడి భూములకు విలువ పెరుగుతుందని, పరిశ్రమలు కూడా వస్తాయని తెలిపారు. అనంతరం పూడూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి విద్యార్థులకు క్రీడా సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రఘునాథ్రెడ్డి, డీసీసీ కార్యదర్శులు షకీల్, పెంటయ్య సర్పంచ్ కిజర్ పాషా, ఉప సర్పంచ్ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
పేదల కోసమే కాంగ్రెస్ పని చేస్తుంది
మోమిన్పేట: పేదల కోసం పనిచేసే ఏకై క పార్టీ కాంగ్రెస్సే అని డీసీసీ అధ్యక్షుల బృందం పేర్కొంది. మంగళవారం మండలంలోని వెల్చాల్ గ్రామంలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. నిరుపేదలు ఆకలితో అలమటించరాదనే కాంగ్రెస్ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో ప్రతి కూలీకి వంద రోజులు పని కల్పించడమే ధ్యేయంగా చట్టం చేసిందన్నారు. ప్రధాని మోదీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి కూలీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్(మల్కాజ్గిరి), అంజన్కుమార్(కరీంనగర్), వంశీకృష్ణ(నాగర్కర్నూల్), గార్లపాటి మద్దిలేటి స్వామి(నంద్యాల), శేక్ అలిబక్షి(నెల్లురు సిటీ), వెంకట వర్మరాజు(విశాఖపట్నం), కొత్తూరి శ్రీనివాస్(కోనసీమ), పార్టీ మోమిన్పేట మండల అధ్యక్షుడు శంకర్, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్, సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ మండలంలో..
అనంతగిరి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షులు మంగళవారం వికారాబాద్ మండలం ఎర్రవల్లి, సిద్దులూర్, గొట్టిముక్కుల, పీలారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రజల జీవన స్థితిగతులు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి గురించి నేరుగా తెలుసుకున్నారు.
ధారూరు మండలంలో..
ధారూరు: మండలంలోని తరిగోపుల, దోర్నాల, నాగసమందర్, కేరెల్లి పంచాయతీల్లో డీసీసీ అధ్యక్షులు పర్యటించారు. ఆయా జీపీల్లో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడారు, ఆరు గ్యారంటీల అమలు గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు బీర్ల అయిలయ్య, వనగాల దలి నాయుడు, సత్య శ్రీనివాసరావు, మల్లికార్జున్, ఎల్.దన్వంతి, సీతక్క, నూకరాజు, ఎం.రాజీవ్ రెడ్డి, షానావాజ్, నర్సింహారావు, సత్యనారాయణ, నరేశ్ జాదవ్, బుక్యా ఉమా, మోత రోహిత్, షేక్ జిలానీ బాషా, తికారాం, నర్సయ్య, విద్యాసాగర్, ప్రసన్న, అన్నాజీ రావు, అబ్దుల్ మతీన్, మురళీధర్, బి.కరుణాకర్, బాలగుర్ణామ్ బాబు తదితరులు పాల్గొన్నారు.


