పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
అనంతగిరి: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 14 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్న 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఒకరోజు ముందుగానే సందర్శించి హాల్ టికెట్ నంబర్లు సరిచూసుకోవాలన్నారు. గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది, విద్యార్థులు సెల్ ఫోన్లు కేంద్రాల్లోకి తీసుకు రాకూడదని ఆదేశించారు. 13,579 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. మాస్ కాపీయింగ్కు అవకాశం ఇవ్వరాదన్నారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఈఓ రేణుకాదేవి, ఏసీజీఈ రాంరెడ్డి, ఆయా మండలాల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు
ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు
కలెక్టర్ ప్రతీక్జైన్


