
దొడ్డు బియ్యం పందికొక్కుల పాలు
కొడంగల్: రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా మారింది జిల్లా అధికారుల తీరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది కానుకగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ మాసం నుంచి సన్నాలు పంపిణీ చేశారు. మార్చి నెల వరకు రేషన్ డీలర్ల దగ్గర మిగిలిన మిగులు దొడ్డు బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు లెక్క కట్టి డీలర్ల దగ్గరే ఉంచారు. ఐదు నెలలు గడుస్తున్నా వాటి గురించి అధికారులు ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జూన్ నెలలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి వినియోగదారులకు అందజేశారు. జూన్ నెల చివరి వరకు దుకాణాలను తెరిచి సన్న బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో రేషన్ దుకాణాలను తెరవక పోవడంతో మిగిలిన ఉన్న దొడ్డు బియ్యం పంది కొక్కుల పాలవుతోంది. బియ్యానికి పురుగు పట్టి చెడిపోతున్నాయి. డీలర్లు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. అంతేకాకుండా మిగులు బియ్యాన్ని రేషన్ దుకాణాల్లో ఉంచడం వల్ల సన్న బియ్యానికి కూడా పురుగు పడుతోంది. గ్రామాల్లో రేషన్ దుకాణాలు చాలీచాలనీ స్థలంలో ఉన్నాయి. చిన్న పాటి దుకాణాలు ఉన్నాయి. అందులో దొడ్డు బియ్యం, సన్న బియ్యాన్ని ఉంచుకోడానికి డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్య వైకరి కారణంగా వేలాది క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిరుపయోగంగా ఉన్నాయి. పనికి రాకుండా పోతున్నాయని డీలర్లు వాపోతున్నారు.
జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా 588 రేషన్ దుకాణాల ద్వారా 8,97,270 మంది వినియోగదారులకు ప్రతినెలా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. అలాగే 2.09 లక్షల ఆహార భద్రత కార్డులు, 25వేల అంత్యోదయ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా 5,200 టన్నుల అలాట్మెంట్ ఉంది. ఈ లెక్కన జిల్లాలోని మొత్తం రేషన్ దుకాణాల్లో మిగిలి ఉన్న బియ్యం వేలాది క్వింటాళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని దొడ్డు బియ్యం తంటా తెంపాలని డీలర్లు కోరుతున్నారు.
ఒక్క కొడంగల్లోనే 750 క్వింటాళ్లు
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
డీలర్ల వద్ద మగ్గి, పురుగు పడుతున్న వైనం
పట్టించుకోని జిల్లా అధికారులు