తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, పద్మావతి జూనియర్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. రెండు కళాశాలల్లో దాదాపు అన్ని గ్రూప్లలో సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. గత రెండు రోజులగా జరిగిన స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో తొలిరోజు రెండు వందలకు పైగా సీట్లు భర్తీకాగా, రెండవ రోజు 300కు పైగా సీట్లను భర్తీ చేశారు. ఎస్వీ జూనియర్ కళాశాలలో చివరి రోజు సుమారు 200 సీట్లు వరకు భర్తీ చేసినట్లు తెలుస్తోంది. ఆరు విడదలతో జరిగిన మెరిట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కంటే స్పాట్ కౌన్సెలింగ్ ప్రక్రియలోనే సుమారు 40 శాతంపైగా సీట్లు భర్తీ కావడం విశేషం. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను శుక్రవారం డీఈఓ ఫణికుమార్ పద్మావతి జూనియర్ కళాశాలలో పర్యటించి పర్యవేక్షించారు.
22 స్టార్టర్లు చోరీ
నాగలాపురం: మండలంలోని వేంబాక్కం గ్రామంలో ఒకే రోజు రాత్రి 22 వ్యవశాయ విద్యుత్ మోటారు స్టార్టర్లు చోరీకి గురికావడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు విద్యుత్ మోటారు ఆన్ చేయడానికి ప్రయత్నించగా స్టార్టర్లు కనిపించలేదు. వెంటనే బాధిత రైతులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వారం క్రితం 30 స్టార్టర్లు చోరీకి గురైనట్టు రైతులు ఆరోపించారు. ఒక్కో స్టార్టర్ విలువ రూ.5,500 ఉంటుందని, వారం రోజుల వ్యవధిలోనే రూ.2,86,000 నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
2,87,759 ఓట్లు తగ్గాయి ‘సర్’
తిరుపతి అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 17,69,438 ఓట్లర్లుకు గాను 14,81,679 మందికి చెందిన ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే తిరిగి బీఎల్వోలకు చేరాయి. 2,87,759 ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి చేరలేదు. వీరంతా శాశ్వతంగా వెళ్లిపోయినవారు, డూప్లికేట్లు, మృతి చెందిన వారుగా భావిస్తున్నారు.
లారీని ఢీకొన్న బైక్
చంద్రగిరి: లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలైన ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వరంగల్కు చెందిన రవి(34) పట్టణంలోని పోలీసు స్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంకులో పంపు ఆపరేటర్గా పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి రవి, జోగుల కాలనీకి చెందిన సయ్యద బాషాతో కలసి ఐతేపల్లిలోని దాబాకు వెళ్లారు. అనంతరం ద్విచక్ర వాహనంలో అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో అగరాల సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద సర్వీసు రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందగా, సయ్యద్బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


