తిరుపతి అర్బన్: బీసీల వాటాను తేల్చి చెప్పాలంటూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి కలెక్టరేట్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టా రు. అనంతరం జాయింట్ కలెక్టర్ గోవింద్రావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ ఓబీసీలు సామాజిక అణచివేతకు, ఆర్థిక దోపిడీకి గురై వెనుకబడిపోయారని ఆవేదన చెందారు. అన్ని విధాలా అభివృద్ధి చెందిన ఓసీ మహిళలతో బీసీ మహిళలు పోటీపడి చట్ట సభల్లో అడుగుపెట్టడం అసాధ్యమన్నారు. అందుకే తప్పనిసరిగా 33 శాతం మహిళా రిజర్వేషన్లతో కేంద్రం ఆమోదించిన మహిళా చట్టానికి బీసీ మహిళకు సబ్ కోటానిస్తూ సవరణ చేసి మాత్రమే అమలు జరపాలని డిమాండ్ చేశారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కంభం లోకయ్య, మధు, పి.జ్యోతి, డాక్టర్ మస్తానమ్మ, నాగేంద్ర, యశోద పాల్గొన్నారు.


