చంద్రగిరి: ఖాకీ చొక్కా ఉందనే ధీమాతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్.. వంటమాస్టర్పై దాడి చేశాడు. జీతం డబ్బులు అడిగినందుకు విచక్షణారహితంగా చితకబాదాడు. ఫుల్గా మద్యం సేవించి నడిరోడ్డుపై వీరంగం వేశాడు. గూండాల కంటే దారుణంగా ప్రవర్తిస్తూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన తిరుచానూరు పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాలు.. ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న త్యాగరాజులు.. తిరుపతి శిల్పారామంలో సమీపంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అందులో తిరుచానూరుకు చెందిన లోకనాఽథరెడ్డి మూడు నెలల నుంచి వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. జీతం డబ్బులు సరిగ్గా ఇవ్వకపోతుండడంతో విసిగిపోయిన లోకనాథరెడ్డి.. వంట మాస్టర్గా పనిచేయలేనని త్యాగరాజులుకు చెప్పాడు. ఈ క్రమంలో శనివారం లోకనాథరెడ్డి ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్ త్యాగరాజులు.. అక్కడున్న వృద్ధురాలితో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో త్యాగరాజులకు లోకనాథరెడ్డి ఫోన్ చేయగా.. ఫాస్ట్ఫుడ్ సెంటర్కు వస్తే, నీ లెక్క(డబ్బులు) ఇస్తానని నమ్మించాడు. దీంతో దుకాణం వద్దకు వెళ్లిన లోకనాథరెడ్డిపై అప్పటిగా మద్యం మత్తులో ఉన్న త్యాగరాజులు, వెంకటేశ్ అనే వ్యక్తి కలిసి విచక్షణరహితంగా దాడి చేశారు. ‘నేను పోలీస్ను.. నాపై ఎవరురా ఫిర్యాదు చేసేది.. వీడిని ఇక్కడే నరుకుతా’ అంటూ త్యాగరాజులు వీరంగం వేశాడు. ఆపై ఫాస్ట్ఫుడ్ సెంటర్లోని గదిలో నిర్బంధించి చితకబాదాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ట్రాఫిక్ కానిస్టేబుల్ త్యాగరాజులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. అయినా కూడా పోలీసుల ఎదుటే మరోసారి బాధితుడిపై త్యాగరాజులు దాడి చేశాడు. చివరకు పోలీసులు అతికష్టం మీద త్యాగరాజులును అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని తిరుపతి రుయాకు తరలించారు.


