నేడు డయల్ యువర్ సీఎండీ
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్య సాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు 89777 16661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలు తెలియజేయాలని సీఎండీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కి ల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. వినియోగదారులు తిరుపతి 8712652679, చిత్తూరు 7993147979, నెల్లూరు 08612320427, అన్నమయ్య 9440817449, కడప 08562 242457, కర్నూలు 7382614308, నంద్యాల 7382618976, అనంతపురం 9154790350, శ్రీసత్యసాయి 9963707847 నెంబర్లలో ఎస్ఈలకు సమస్యలను వివరించవచ్చని ఏపీఎస్పీడీసీఎల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
కొనసాగిన ఏసీబీ తనిఖీలు
సూళ్లూరుపేట: రెవెన్యూ డివిజనల్ కార్యాలయంపై శనివారం సాయంత్రం 3 గంటల నుంచి ఆదివారం 3.30 గంటల దాకా అంటే 24 గంటలపాటు అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. అయితే శనివారం ఉదయమై సూళ్లూరుపేట వచ్చిన వారు ముందుగా రూ.40 వేలు లంచం నగదును ఇచ్చే దగ్గర నుంచి ఆదివారం సాయంత్రం 3.30 గంటల దాకా తీసుకుంటే సుమారు ఒకటిన్నర రోజు ఏసీబీ ట్రాప్ కేసు నడిచింది. ఈ ట్రాప్లో ఆర్డీఓ సీసీ హేమంత్, సీనియర్ అసిస్టెంట్ సిరాజ్, నగదు తీసుకున్న మెకానిక్ వెంకటసుబ్బయ్యలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. శనివారం రాత్రి వారి ఇళ్లల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో ఐదు సంవత్సరాల రికార్డులు కూడా పరిశీలించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి పట్టుబడిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇంకా ఎక్కడైనా ఇలా అధికారులు అక్రమంగా డబ్బులు అడిగితే ఏసీబీకి సమాచారం అందించాలని ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి కోరారు. 1064 టోల్ప్రీ నెంబర్కు కాల్ చేసి పూర్తి సమాచారం అందిస్తే తగిన రీతిలో స్పందిస్తామని ఆమె తెలిపారు.
అదనపు ఎస్పీగా
ఆర్ల శ్రీనివాసులు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా క్రైమ్ విభాగం అదనపు ఎస్పీగా ఆర్ల శ్రీనివాసులు శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. చార్జ్ తీసుకున్న అనంతరం జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడకుండా పనిచేయాలన్నారు. అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో క్రైమ్ విభాగంపై పూర్తి స్థాయి అవగాహన సాధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఐసెట్ దరఖాస్తులకు
నేడే ఆఖరి గడువు
తిరుపతి సిటీ: రాష్ట్రంలోని పలు వర్సిటీలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్–2026 ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు సోమవారంతో ముగియనుంది. గత నెల 5వ తేదీ నుంచి ఐసెట్కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా సోమవారం సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఐసెట్ ప్రవేశ పరీక్ష మే నెల 2వ తేదీన నిర్వహించనున్నారు.


