కలెక్టరేట్ ఎదుట మిన్నంటుతున్న రోదనలు
● క్షేత్రస్థాయిలో చేతులెత్తేసిన అధికారులు ● పేరుకుపోతున్న రెవెన్యూ సమస్యలు ● చిన్నపాటి సమస్యకు కలెక్టరేట్ మెట్లు తొక్కుతున్న జనం ● కలెక్టరేట్ అధికారులు మళ్లీ క్షేత్రస్థాయికి పంపుతున్న పరిస్థితి ● సమస్య పరిష్కారం కాక కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం ● అర్జీదారులను తిరుచానూరు పోలీస్స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఓ ప్రహసనంగా మారింది. కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. కింది స్థాయిలో సమస్య పరిష్కారం కాక కలెక్టరేట్కు చేరితే.. ఆ ఆర్జీ మళ్లీ కిందికే వెళుతోంది. పరిష్కారానికి నోచని సమస్యలు.. ఆస్తులు పరాధీనం కావడాన్ని పేదలు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీటి సుడులు తిరుగుతున్న కష్టజీవులు ఆ బాధలను భరించలేక తరచూ కలెక్టరేట్ ఎదుట ప్రాణత్యాగాలకు సిద్ధమవుతున్నారు. అయితే వారిని పోలీసులు కేసుల పేరుతో వేధిస్తూ కన్నీటి ఉప్పెనలో ముంచేస్తున్నారు. ఇదీ బాబు సర్కారులో బాధితుల దుస్థితి.
తిరుపతి అర్బన్: క్షేత్రస్థాయిలో చిన్నపాటి సమస్యలకు సైతం పరిష్కారం చూపడం లేదు. కూటమి పాలనలో అన్ని విభాగాలు అలానే తయారయ్యా యి. ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు తమకు వ్యక్తిగతంగా ప్రయోజనం ఉంటేనే పరిష్కారం వైపు ఆలోచన చేస్తున్నారు. ప్రయోజనం లేదంటే పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. ఇటీవల రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అదనపు అధికారులు నియమించారు. అయినా క్షేత్రస్థాయిలో సమస్యలకు పరిష్కారం కావడం లేదు. దీంతో వారంతా కలెక్టరేట్ బాట పడుతున్నారు. కలెక్టరేట్ అధికారులు అర్జీలను తిరిగి క్షేత్రస్థాయికి పంపుతున్నారు. దీంతో రెవెన్యూ సమస్యలు పేరుకుపోతున్నాయి. రెవెన్యూ సదస్సులు, రెవెన్యూ క్లినిక్లు తూతూ మంత్రంగా మారాయి. దీంతో ఆర్జీదారులు ఆక్రోశం, ఆవేదన, ఆక్రందనలకు కలెక్టరేట్ కేంద్రంగా మారుతుంది. కొందరు ఏకంగా ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా చేయడం నేరమంటూ పోలీసులు పదేపదే చెబుతున్న ఆవేదనతో ఒంటిపై పెట్రోల్ పోసుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తిరుచానూరు పోలీసులు కేసులు కడుతామని హెచ్చరిస్తున్నారు. అయితే బాధితులు మాత్రం తమ ఆస్తులు పోతే.. తాము జీవనం ఎలా సాగించాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఆఘాత్యాలకు పాల్పడుతున్నారు.
సమస్య తిరిగి,తిరిగి అక్కడికే..
బాబు సర్కారు పాలనలో అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 85 శాతం సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. బాధితులు కలెక్టరేట్లో అర్జీ సమర్పించిన తర్వాత, అది తిరిగి అదే మండల స్థాయి అధికారులకు(తహసీల్దార్)కు చేరుతుంది. ఏ అధికారైతే అవినీతికి పాల్పడ్డారని, నిర్లక్ష్యం వహించారని బాధితుడు ఫిర్యాదు చేస్తాడో, అదే అధికారి ఆ ఫిర్యాదును పరిష్కరించాల్సి రావడం ఓ వింతగా మారుతోంది. ఫలితంగా, క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కరించినట్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
ఉద్యోగులు నిబంధనలు పాటించరా?
వివాదాస్పద భూములపై మండల కేంద్రాల్లోనే బహిరంగ విచారణ జరిపి అక్కడికక్కడే పరిష్కరించాలి. అలాగే గ్రీవెన్స్లో ఇచ్చిన అర్జీ 30 రోజుల్లో పరిష్కారం కాకపోతే సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఆన్లైన్ రికార్డుల్లో జరుగుతున్న మార్పులపై ఒక స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలి. కలెక్టరేట్ వద్ద కేవలం సెక్యూరిటీ కాకుండా, బాధితుల మానసిక స్థితిని గమనించి వారికి భరోసా ఇచ్చే కౌన్సెలింగ్ సెంటర్ ఉండాలి. జిల్లా స్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒకే సమస్యపై మూడు సార్లు గ్రీవెన్స్కు వస్తే, ఆ మండల తహసీల్దార్ను బాధ్యుడిని చేస్తూ షోకాజ్ నోటీసు ఇవ్వాలి. భూమి రికార్డుల్లో మార్పులు జరిగినప్పుడు యజమాని ఫోనన్కు మెసేజ్ వచ్చేలా ’సెక్యూరిటీ లేయర్’ ఏర్పాటు చేయాలి. అయితే అలాంటి చర్యల దిశగా సర్కార్ అడుగులు వేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కలెక్టరేట్ వద్ద గత నవంబర్ 3న పెట్రోల్తో నిరసన
పీజీఆర్ఎస్ సందర్భంగా కలెక్టరేట్ వద్ద గత ఏడాది నవంబర్ 3వ తేదీన తిరుపతి సంజయ్గాంధీకాలనీలో తమ ఇంటి నిర్మాణాన్ని టీడీపీ నేత అడ్డుకుంటున్నారంటూ వెంకటసుబ్బమ్మ, లక్ష్మీదేవి అనే ఇద్దరు మహిళలు తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. తమకు ఉన్న ఆస్తి అది ఒక్కటేనని అది లాక్కొంటే తమ జీవనం ప్రశ్నార్థకం అని ఆవేదన చెందారు. దీంతో వారిని తిరుచానూరు పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం స్టేషన్కు తరలించారు.
మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి గోవిందా!
అర్జీదారులు ఓ సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్కు వస్తే మరో సమస్య ఎదుర్కొవాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. న్యాయం కోసం కలెక్టరేట్కు వస్తే...కేసుల పేరుతో పోలీసులు భయపెట్టడం న్యాయమేనా? అని మండిపడుతున్నారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా గోవిందా! అని దేవదేవుని వేడుకుంటున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కావడంలేదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. పోలీసులు మాత్రం కేసులు కట్టడం లేదని, వారికి కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చి పంపుతున్నట్లు చెబుతున్నారు.
గత నవంబర్ 15న..
శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తమ ఇళ్లు తొలగిస్తున్నారని, కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా జేసీబీతో కూల్చేశారని పలువురు బాధితులు గత ఏడాది నవంబర్ 15వ తేదీన కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పెట్రోల్ తమ ఒంటిపై పోసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆర్డీ యుగంధర్, ఆర్డీ సంజీవమ్మ, జే.రాజేంద్రప్రసాద్, డి.షరావతి, డి. ప్రశాంత్ ఆనే ఐదుగురిని తిరుచానూరు పోలీస్స్టేషన్కు తరలించారు.
కలెక్టరేట్ ఎదుట మిన్నంటుతున్న రోదనలు
కలెక్టరేట్ ఎదుట మిన్నంటుతున్న రోదనలు
కలెక్టరేట్ ఎదుట మిన్నంటుతున్న రోదనలు
కలెక్టరేట్ ఎదుట మిన్నంటుతున్న రోదనలు


