
నగరంలో సీవీఐఆర్ఎంఎస్ అమలు
తిరుపతి క్రైం : తిరుపతి నగరంలో ప్రజా భద్రత, నేర నిరోధక చర్యలను మరింత బలోపేతం చేయడానికి సిటీ విజిటర్ ఇన్ఫర్మేషన్ అండ్ రికవరీ మేనేజ్మెంట్ సిస్టం(సీవీఐఆర్ఎంఎస్)ను అమలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవస్థను హోటళ్లు, లాడ్జీలు, పీజీ సెంటర్లలో అమలుచేస్తున్నట్టు తెలిపారు. అక్కడ చేరేవారు తమ వివరాలకు సంబంధించి గుర్తింపు కార్డులు నమోదు చేయగానే పోలీసు రికార్డులతో అనుసంధానం అవుతాయని తెలిపారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు వస్తే వెంటనే అలర్ట్ వచ్చే విధంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇప్పటి వరకు 664 హోటళ్లు, హోమ్ స్టేలలో సిస్టంను ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన వాటిల్లోనూ పూర్తి చేస్తామన్నారు. ఇందులో ఆధార్ ఐ కనెక్ట్ను కూడా తీసుకుంటామన్నారు. ఇకమీదట ఈ సిస్టం పోలీసు స్టేషన్లో అమలు అవుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకట్రావు, సిబ్బంది పాల్గొన్నారు.