
అయోమయం
డిసిగ్నేషన్ లేని దుస్థితిలో
తాత్కాలిక అధ్యాపకులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా
ఊసే ఎత్తని అధికారులు
అవకాశం దొరికితే వేటు వేసేందుకే
ప్రయత్నాలు
దయనీయం..
తిరుపతి సిటీ : విశ్వవిద్యాలయాల్లోని తాత్కాలిక అధ్యాపకుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉద్యోగ భద్రతలేని అయోమయంలో కొట్టుమిట్టాడే దుస్థితి దాపురించింది. ఈ క్రమంలోనే వర్సిటీ అధికారుల నిరంకుశ ధోరణపై నోరు మెదపలేని పరిస్థితి. వాస్తవానికి విద్యార్థులు, పరిశోధకులకు తోడ్పాటు అందిస్తోంది తాత్కాలిక అధ్యాపకులే. అయినా వారిని ఉన్నత విద్యామండలి, వర్సిటీల అధికారులు చిన్నచూపు చూస్తున్నారు.
డిసిగ్నేషన్ ఏదీ..?
తాత్కాలిక అధ్యాపకులకు డెసిగ్నేషన్ కూడా లేదు. పక్క రాష్ట్రాల్లో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో తాత్కాలిక అధ్యాపకులకు ‘అసిస్టెంట్ ప్రొఫెసర్‘ హోదా కల్పించారు. మన రాష్ట్రంలో మాత్రం వారిని మూడు నెలలకు ఒకసారి కాంట్రాక్టులు రెన్యువల్ చేస్తూ, వేతనాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. వర్సిటీలలోఅన్యాయాలపై ఎవరు గళం విప్పినా వేతనాలు నిలిపివేస్తారు. ప్రతి మూడు నెలలకు ఉద్యోగం ఉంటుందో లేదో అనే ఆందోళన వల్ల బోధన, పరిశోధన సక్రమంగా చేయలేక అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
శాశ్వత అధ్యాపకుల నియామకాలు లేనట్టేనా?
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్సిటీలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి నిరుద్యోగులకు శఠగోపం పెట్టేసింది. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి, రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకున్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం వందల సంఖ్యలో వర్సిటీలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల నియామకాలు చేపట్టేందుకు కూటమి ప్రయత్నం మొగ్గు చూపకపోవడం దారుణమని విద్యార్థులు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నత విద్యామండలి చొరవ చూపాలి
తాత్కాలిక అధ్యాపకులకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా హోదా కల్పించాలి. ఈ విషయంపై ఉన్నత విద్యామండలి చొరవ చూపాలి. వర్సిటీ అధికారులతో చర్చించి వారికి డిసిగ్నేషన్ కల్పించే ప్రయత్నం చేయాలి. శాశ్వత అధ్యాపకుల నియామకాలకు ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి. తొలగించిన అధ్యాపకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.
– విద్యార్థి సంఘాల నేతలు, ఎస్వీయూ
వీధిన పడేయడం దారుణం
తాత్కాలిక అధ్యాపకుల పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తాయారవుతోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఉద్యోగం ఉంటుందో.. పోతుందో అనే భయంతో జీవిస్తున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పెర్ఫార్మెన్స్ రివ్యూ‘ పేరుతో అనేకమందిని తొలగించారు. ఏళ్ల తరబడి సేవలందించిన అధ్యాపకులను సైతం వీధుల్లో పడేశారు.