
యాదగిరిగుట్ట: ఈ నెల 25న సూర్యగ్రహణం ఉన్నందున యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిత్య కైంకర్యాలు, నివేదన ఉదయం 8.50 గంటల్లోపు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 4.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.28 గంటలకు సమాప్తం అవుతుందని తెలిపారు.
దీంతో ఆ రోజు ఉదయం 8.50 గంటల నుంచి 26వ తేదీ 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు వెల్లడించారు. తిరిగి మర్నాడు ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తెరచి.. సంప్రోక్షణ అనంతరం 10 గంటల నుంచి భక్తులను దైవ దర్శనాలకు అనుమతించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిత్యపూజలు రద్దు చేసినట్టు చెప్పారు.