యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలు, రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం శ్రీనృసింహస్వామిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకునేందుకు క్యూకట్టారు. దీంతో శ్రీస్వామి వారి ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధులు, కొండపైన, కొండ కింద బస్టాండ్లు, మెట్ల మార్గం, ఘాట్ రోడ్డు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, క్యూకాంప్లెక్స్, శివాలయం, ప్రసాద విక్రయశాల వంటి ప్రాంతాలు భక్తుల రాకతో సందడిగా మారాయి.
ధర్మ దర్శనానికి 4 గంటలకు పైగా, వీఐపీ రూ.150 టికెట్ దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. ఇక బ్రేక్ దర్శనానికి 30 నిమిషాలకు పైగానే సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 90 వేల మంది భక్తులు దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వివిధ పూజలతో యాదగిరీశుడికి నిత్యాదాయం రూ.73,75,642 వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు.


