బాసర ట్రిపుల్‌ ఐటీ.. సిబ్బంది గురించి వెలుగులోకి షాకింగ్‌ వాస్తవాలు!

Worst in Basara IIIT Mess Staff Bathing In Kitchen - Sakshi

తీరు మారని ‘ట్రిపుల్‌ ఐటీ’ మెస్‌

ఇందులోనే ఫుడ్‌ పాయిజన్‌ 

నిర్మల్‌: సరిగ్గా ఇరవై రోజుల క్రితం బాసర ట్రిపుల్‌ఐటీలోని కేంద్రీయ భండార్‌ మెస్‌లో తిన్న విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌ బారిన పడ్డారు. దాదాపు 600మంది విద్యార్థులు అనారోగ్యం పాలవగా, 20మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత సీరియస్‌ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఇవేవీ తమకు పట్టవన్నట్లు సదరు మెస్‌ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఫుడ్‌ పాయిజన్‌ జరిగిన కేంద్రీయ భండార్‌ మెస్‌లోనే తాజాగా స్నానాల సీన్‌ బయటకు వచ్చింది. 

వంటగదిలోనే..: ఇరువైపులా.. విద్యార్థుల కోసం వండి, వడ్డించే వంటపాత్రలు ఉన్న గదిలోనే ఇద్దరు సిబ్బంది స్నానాలు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. వేలమంది విద్యార్థుల కోసం వంటలు చేసేచోట స్నానాలు చేయడం ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. వరు సగా ఘటనలు చోటుచేసుకుంటూ, రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం అవుతున్నా.. వర్సిటీ అధికారుల తీరు మారడంలేదు.

‘‘వర్సిటీని ప్రక్షాళన చేస్తున్నాం. వార్డెన్లు, మెస్‌ ఇన్‌చార్జిలను నియమిస్తున్నాం. పక్కాగా పర్యవేక్షిస్తున్నాం’’ అంటూ ఉన్నతాధికారులు తరచూ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు లేదు. ఇలా.. వంటగదిలో స్నానాలు, నాణ్యతలేని ఆహారం య«థావిధిగా కొనసాగుతున్నాయి.

అసలు చర్యలేవి..: ఫుడ్‌పాయిజన్‌ అయి 20 రోజులవుతోంది. ఘటనకు కారణమైన కేంద్రీయ భండార్, ఎస్‌ఎస్‌ మెస్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. కానీ.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. యథావిధిగా ఆ మెస్‌ కాంట్రాక్టర్లనే ఇంకా కొనసాగి స్తున్నారు.  కేంద్రీయ భండార్‌ కాంట్రాక్టర్‌కు బడానేతలు, అధికారులతో బలమైన సంబంధాలు ఉన్నాయని, అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top