
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రాజ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మహిళా ఉద్యోగులను చీఫ్ కంట్రోలర్ వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది. చీఫ్ కంట్రోలర్ వేధింపులను భరించలేక మంత్రి సీతక్కకు ఆ మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని.. అర్ధరాత్రి వీడియో కాల్స్, జిల్లా టూర్లతో వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.
చీఫ్ ఇంజనీర్ వేధింపులు భరించలేక పలువురు మహిళలు ఉద్యోగం మానేసినట్లు సదరు మహిళా ఉద్యోగులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల ఫిర్యాదుతో మంత్రి సీతక్క విచారణకు ఆదేశించారు. ఇంటర్నల్ విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రెటరీకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మహిళా మంత్రి శాఖలో మహిళలపై వేధింపుల అంశంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.