బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళ తీవ్ర ఆరోపణలు

Woman Allegations On Bellampalli MLA Durgam Chinnaiah Audio Viral - Sakshi

సాక్షి, మంచిర్యాల: బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేపై మహిళా తీవ్ర ఆరోపణలు చేశారు. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్‌ పాల సంస్థ భాగస్వామి శైలజ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించాడని తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆడియోలో.. ‘దుర్గం చిన్నయ్య అనే వ్యక్తిని తొలిసారి మా బ్రాంచ్‌ ఓపెనింగ్‌ రోజు కలిశాము. మీ కంపెనీలో మాకు తెలిసన వాళ్లకు షేర్స్‌ ఇవ్వండి.. మీకు ఫుల్‌ సపోర్ఠ్‌ చేస్తాను, మీకు ఏం కావాలన్నా చేసి పెడతాను అని చెప్పారు. మేము దానికి ఓకే చెప్పాము. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తరుచూ బిజినెస్‌ పనుల కోసం మాట్లాడేవాళ్లం. కొన్నిసార్లు మాతో పాటు మా దగ్గర పనిచేసే ఒక అమ్మాయి కూడా వచ్చేది. ఒకరోజు ఎమ్మెల్యే కాల్‌ చేసి మీతోపాటు ఒక అమ్మాయి వచ్చింది కదా.. ఆమెను ఒకరోజుకు నాతో పంపిస్తారా అని అడిగారు.

ఆ అమ్మాయి అలాంటిది కాదని చెప్పాం. కానీ ఎవరో ఒక అమ్మాయిని తప్పకుండా తన దగ్గరికి పంపాలని ఎమ్మెల్యే అడిగారు. లేకపోతే మీ ఇష్టం అంటూ బెదిరించారు. దీంతో చేసేదేం లేక తెలిసిన వాళ్ల ద్వారా బ్రోకర్ల నెంబర్లు ఇస్తే మేము డైరెక్ట్‌గా ఆయనకు అప్పజెప్పాం. వాళ్లతో ఆయన టచ్‌లో ఉన్నారు. తరువాత దళితబంధు సమావేశమని మళ్లీ ఒకసారి మమ్మల్ని పిలిపించి మందు ఏర్పాటు చేశారు. నాతో బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించాడు. నన్ను లైంగిక వేధింపులకు గురిచేశాడు. నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను.

మా దగ్గర డబ్బులు తీసుకొని తన పర్సనల్‌ పనులకు వాడుకున్నాడు. చెప్పింది చేయకుంటే మమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. చాలా మోసం చేశాడు. మళ్లీ దళిత బంధు గురించే మట్లాడాలని ఒత్తిడి చేసి బెల్లంపల్లిలోని ఆయన ఇంటికి పిలిపించాడు. తరువాత ఆయన అక్కడున్న పోలీసులకు మమ్మల్ని అప్పగించి 3 రోజులు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. మేం ఏం తప్పులు చేయకున్నా తప్పుడు కేసులు పెట్టి పోలీసులు టార్చర్‌ చేశారు. మాకు సంబంధం లేదు అని చెబితే కూడా మీరు ఏమున్నా ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి అని చెప్పారు.

ఆయన చెప్పిన దానికి ఒప్పుకోవడం లేదని నన్ను రిమాండ్‌కు పంపించారు. రిమాండ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రెండు తప్పుడు కేసులు పెట్టి ఇరికించారు. ఏ కేసులతో నాకు ఏలాంటి సంబంధం లేదు. తప్పుడు కేసులకు సంబంధించి మా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి. వీటిని చూపిస్తుంటే కూడా పోలీసులు.. మాకు ఇవ్వన్నీ సంబంధం లేదన్నట్లు మాట్లాడుతున్నారు.  దుర్గం చిన్నయ్య, వాళ్ల మనుషుల నుంచి నాకు ప్రాణహాని ఉంది.  నాకు మీడియా సపోర్ట్‌ కావాలి. నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకు రావాలి’ అని శైలజ విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top