టీన్‌ టీకా.. ఆ అపోహలు నమ్మకండి: మంత్రి హరీష్‌ | Sakshi
Sakshi News home page

టీనేజర్లకు టీకాల కార్యక్రమం!!

Published Tue, Jan 4 2022 8:05 AM

Vaccines Started For Teenagers In The Hyderabad - Sakshi

సాక్షి హైదరాబాద్‌: టీనేజర్లకు టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌– 7లోని యూపీహెచ్‌సీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు టీకాలను ప్రారంభించగా, రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట యూపీహెచ్‌సీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో మొత్తం 45,319 మందికి కోవిడ్‌ టీకాలు వేయగా, వీరిలో 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లు 5,525 మంది ఉన్నారు.

(చదవండి: worlds longest name: ఎంత పె...ద్ద.. ‘పేరు’!)

ఈ సందర్భంగా మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డిలు మాట్లాడుతూ.. కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బాధితులు అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని సూచించారు. ఆధార్‌ కార్డు లేని టీనేజర్లకు కాలేజీ గుర్తింపు కార్డు చూసి టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. మరో నాలుగు రోజుల తర్వాత  కోవిన్‌ యాప్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రేటర్‌ పరిధిలోనూ నేరుగా వచ్చిన వారికి టీకాలు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. తొలిడోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు టీకాను వేయనున్నట్లు తెలిపారు. టీకా వేసుకున్న తర్వాత జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

(చదవండి: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే పుట్టిన బామ్మ బర్త్‌డే!)

Advertisement
Advertisement