త్వరలో కృష్ణా ట్రిబ్యునల్‌–2 అమల్లోకి..? | Union Water Resources Minister to meet with states on 7th of this month | Sakshi
Sakshi News home page

త్వరలో కృష్ణా ట్రిబ్యునల్‌–2 అమల్లోకి..?

May 2 2025 3:58 AM | Updated on May 2 2025 3:58 AM

Union Water Resources Minister to meet with states on 7th of this month

ఈనెల 7న రాష్ట్రాలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సమావేశం 

తీర్పుపై గెజిట్‌ ప్రచురణ విషయంలో అభిప్రాయ సేకరణ 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ నేతృత్వంలో కృష్ణా ట్రిబ్యునల్‌–2 జారీ చేసిన తీర్పును అమల్లోకి తీసుకురావడంలో భాగంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంలో అభిప్రాయ సేకరణ కోసం ఈ నెల 7న కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్‌.పాటిల్‌ సంబంధిత రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో సమావేశం కానున్నారు. కృష్ణా జలాల పంపిణీపై 2013 నవంబరు 29న కృష్ణా ట్రిబ్యునల్‌–2 తీర్పు వెలువరించింది. తీర్పును అమల్లోకి తెస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయరాదని కోరుతూ నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సైతం ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యింది. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న వాటాను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే బాధ్యతలను కృష్ణా ట్రిబ్యునల్‌–2కే కేంద్రం అప్పగించింది. దీనిపై ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతోంది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1,005 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు పంచడానికి మాత్రమే విచారణ జరుగుతున్న ట్రిబ్యునల్‌ తీర్పును అమల్లోకి తెస్తూ గెజిట్‌ ప్రకటన జారీ చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక కోరుతున్నాయి. 

ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో ఈనెల 7న న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. ఈ భేటీలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే గెజిట్‌ ప్రకటన జారీ చేసే అవకాశముంది. దీంతో కృష్ణా ట్రిబ్యునల్‌–2 తీర్పు అమల్లోకి రానుంది. ప్రధానంగా ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచడం, ఇతర బేసిన్లో ఉన్న కోయిన ప్రాజెక్టుకు 92 టీఎంసీల నీటిని కేటాయించడంపై ఉమ్మడి ఏపీ అభ్యంతరం తెలిపింది.  

ఇంకా కృష్ణా ట్రిబ్యునల్‌–1 కేటాయింపులే.. 
కృష్ణా ట్రిబ్యునల్‌–1 (బచావత్‌ ట్రిబ్యునల్‌) కృష్ణాలో 2,060 టీఎంసీల లభ్యత ఉందని నిర్ధారించి మహారాష్ట్రకు 560, కర్ణాటకకు 700, ఉమ్మడి ఏపీకి 800 టీఎంసీల కేటాయింపులు జరిపింది. దీనికి అదనంగా రీజనరేట్‌ అయిన 11 టీఎంసీలను కూడా జోడించింది. కృష్ణా ట్రిబ్యునల్‌–2 తీర్పు అమల్లోకి రాకపోవడంతో 1976లో అమల్లోకి వచ్చిన కృష్ణా ట్రిబ్యునల్‌–1 కేటాయింపులే ఇంకా అమలవుతున్నాయి. వందేళ్లలో కచ్చితంగా 75 ఏళ్ల పాటు వచ్చే వరద (75 శాతం లభ్యత) ఆధారంగా 2,060 టీఎంసీల నీటిలభ్యత కృష్ణాలో ఉందని కృష్ణా ట్రిబ్యునల్‌–1 తేల్చింది. 

65 శాతం లభ్యత ఆధారంగా కృష్ణాలో 2,578 టీఎంసీల లభ్యత ఉందని కృష్ణా ట్రిబ్యునల్‌–2 నిర్ధారించి ఉమ్మడి ఏపీకి 1,005, కర్ణాటకకు 907, మహారాష్ట్రకు 666 టీఎంసీల కేటాయింపులు చేసింది. 65 శాతం లభ్యతతో నీటి కేటాయింపులు చేస్తే దిగువ రాష్ట్రాలు నష్టపోతాయని ఉమ్మడి ఏపీ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో 7న జరగబోయే సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరితేనే కృష్ణా ట్రిబ్యునల్‌–2ను అమల్లోకి తెస్తూ గెజిట్‌ ప్రకటన వస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement