290 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో మొత్తం 290 ఖాళీల భర్తీకి మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. టీజీపీఎస్సీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు 222, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 49 ఉన్నాయి.
అలాగే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులు 19 భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయోపరిమితి 2026, జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సివిల్ ఏఈఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ జూన్ 6 నుంచి జూలై 13 వరకు, ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులకు జూన్ 8 నుంచి జూలై 15 వరకు, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు జూన్ 10 నుంచి జూలై 17 వరకు కొనసాగుతుంది. పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక విధానం, పరీక్ష వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి ఎం.హరిత తెలిపారు. 


